🟡 ఢిల్లీ/ఏలూరు : ది డెస్క్ :
ఎంపీ పుట్టా మహేష్ ప్రశ్నకు లోక్సభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడి
అత్యాధునిక వైద్య పరికరాల తయారీలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు శుక్రవారం సమాధానమిచ్చిన మంత్రి, పీఎల్ఐ (PLI), మెడికల్ డివైస్ పార్క్స్, ఎస్ఎండీఐ (SMDI) పథకాల ద్వారా వైద్య పరికరాల తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడించారు.
క్యాన్సర్ చికిత్స, రేడియాలజీ, కార్డియో-రెస్పిరేటరీ పరికరాలు, ఇంప్లాంట్ల తయారీకి ప్రోత్సాహకాలు కొనసాగుతున్నాయని, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, లీనాక్లు, మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, గుండె కవాటాలు, స్టెంట్ల వంటి పరికరాల దేశీయ తయారీ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. మెడ్టెక్ పార్కుల అభివృద్ధికి ఒక్కో పార్కుకు రూ.100 కోట్ల వరకు కేంద్ర సహాయం అందిస్తున్నామని, 2021-22 నుంచి 2025-26 వరకు ఈ రంగంలో రూ.17,201 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వచ్చినట్లు నడ్డా వెల్లడించారు.

