🟡 ఢిల్లీ/ఏలూరు : ది డెస్క్:
MIDH కింద సబ్సిడీలు, సాంకేతిక సహాయం
రైతులు వినియోగించుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ పిలుపు
వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే ఉద్యానవన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉద్యానవన పంటలకు కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహకాలపై ఆయన లోక్సభలో ప్రశ్నించారు.
ఈ కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ మాట్లాడుతూ :
సమగ్ర ఉద్యానవన అభివృద్ధి మిషన్ (MIDH) కింద చిన్న, సన్నకారు రైతులకు రక్షిత సాగు, పాలీహౌస్లు, షేడ్నెట్ హౌస్లు, సూక్ష్మ నీటిపారుదల, మల్చింగ్ తదితర అంశాలకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే స్వచ్ఛ మొక్కల కార్యక్రమం, ఉద్యానవన క్లస్టర్ అభివృద్ధి, క్రాప్ స్పెసిఫిక్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా రైతులకు శిక్షణ, సాంకేతిక మద్దతు అందిస్తున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ మాట్లాడుతూ :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలను సద్వినియోగం చేసుకొని బిందు సేద్యం, స్ప్రింక్లర్లు, పాలీహౌస్లు వంటి ఆధునిక పద్ధతులను అవలంబిస్తే నీటి పొదుపుతో పాటు రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

