ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్ సర్కిల్ : ది డెస్క్ :

కైకలూరు రూరల్ సర్కిల్ పరిధిలోని ముదినేపల్లి, కలిదిండి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల దొంగతనాలు అధికమవుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. కైకలూరు రూరల్ సీఐ వీ. రవికుమార్ ఆదేశాల మేరకు మంగళవారం కైకలూరు రూరల్ సర్కిల్ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసు సిబ్బంది మైక్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.

దొంగతనాల నివారణలో భాగంగా ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు ఇల్లు వదిలి బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు తమ బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇస్తే, గస్తీ సమయంలో ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నా, కొత్తగా నివాసం ఏర్పాటుచేసుకున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి దొంగతనాల నిర్మూలనకు భాగస్వాములు కావాలని కోరారు.

