🔴 పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం : ది డెస్క్ :
భీమవరం పట్టణంలోని ప్రముఖ ఆరాధ్యదైవం మావుళ్లమ్మవారి ఉపాలయంలో కొలువై ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి గణపతి నవరాత్రి ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో కలశస్థాపన, ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.
ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం–శిల్ప దంపతులు కలశస్థాపన పూజ, వినాయక చవితి పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, అతికెల ఆంజనేయ ప్రసాద్, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

