🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

విద్యార్థి దశ నుంచే రహదారి భద్రత నియమాలపై ప్రతి విద్యార్థి అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించ వచ్చునని మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ గేదెల ప్రసాద రావు అన్నారు.
జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగముగా వట్లూరులోని సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు, విద్యాసంస్థల బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు, యాజమాన్య సిబ్బందికి రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమము నిర్వహించారు. బస్సులో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను వివరించారు. విద్యార్థులను తరలించే సమయములో డ్రైవర్లు, క్లీనర్లు, సహాయకులకు వారి బాధ్యతలను తెలియచేశారు. విద్యాసంస్థల బస్సులను నిర్ణీత సమయములోనే ఫిట్ నెస్ పరీక్ష చేయించాలన్నారు.
ప్రమాదానికి గురైన బాధితుడికి ప్రథమ చికిత్స చేసి తక్షణ సహాయాన్ని అందించే విధానాన్ని వివరించారు. ఏవిధముగా వాహనాలను నడిపితే సురక్షిత ప్రయాణము చేయవచ్చునో తెలియచేసారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనము నడపడం నేరమే కాకుండా, రహదారి నియమ నిభందనలు పాటించకపోవడం వాహన చోదకులతో పాటూ ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదమన్నారు.
సమారిటన్ లా గురించి విద్యార్థులకు వివరించారు. రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని, మద్యపానం చేసి వాహనాలు నడపరాదని అలాగే 18 యేళ్లు నిండిన ప్రతి విద్యార్థి డ్రైవింగ్ లైసెన్స్ ను తప్పక పొందాలని, లైసెన్స్ ఆన్ లైన్ ద్వారా లైసెన్స్ పొందే ప్రక్రియను విద్యార్థులకు వివరించారు.
కార్యక్రమములో కళాశాల యజమాన్యము మరియు సిబ్బంది, 230 మంది డ్రైవర్లు, క్లీనర్లు, సహాయకులు మరియు వాహన తనిఖీ అధికారులు ఎస్.బి.శేఖర్, ఎండి. విఠల్, అజ్మీరా బద్దు, జి.స్వామి, కళ్యాణి, నరేంద్ర బాబు పాల్గొన్నారు.