🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఫోటోగ్రఫీ రంగ అభివృద్ధికి ఐక్యతే బలం
సమయపాలనతోనే విజయవంతమైన కార్యక్రమాలు
సురక్షిత ప్రయాణమే ప్రతి ఫోటోగ్రాఫర్ బాధ్యత
కెమెరా డేలో ఉత్సాహభరిత వాతావరణం
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులో “ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో” బుధవారం కెమెరా డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
స్థానిక ఆర్ఆర్పేటలోని లూయిస్ డాగ్యురే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్లు, ఏలూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఫోటోగ్రఫీ రంగం అభివృద్ధి, ఫోటోగ్రాఫర్ల ఐక్యతపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుబ్బారావును దుశ్శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేసి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు మాట్లాడుతూ :
ఫోటోగ్రాఫర్లు విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రాంతాలకు తరచూ ప్రయాణిస్తుంటారని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్యక్రమాలకు హడావుడిగా వెళ్లకుండా కనీసం అరగంట ముందుగానే బయలుదేరేలా సమయపాలన పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.
అనంతరం అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సభ్యులకు ఐడీ కార్డులను అందజేశారు. లూయిస్ డాగ్యురే జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ‘ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. ఉత్సాహభరిత వాతావరణంలో కెమెరా డే వేడుకలు ముగిశాయి.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఉప్పాల జగదీష్బాబు, ఉప్పలపాటి ప్రసాద్, బర్మా బాలాజీ, ఛాయా స్టూడియో రెడ్డి, అధ్యక్షుడు మద్దాల శేఖర్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి ఉజ్వల కుమార్, పీఆర్ఓ మధుసూదన్తో పాటు టీపీటీడబ్ల్యూఏఈ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.

