🟡 ఢిల్లీ/ఏలూరు : ది డెస్క్ :
పొగాకు ఎగుమతుల్లో భారత్ దూకుడు
పొగాకు రైతులకు పెరిగిన ధర.. కిలో రూ.288.65
127 దేశాలకు భారత పొగాకు
ప్రపంచంలో రెండో స్థానం
పొగాకు ఎగుమతులపై లోక్సభలో ఎంపీ పుట్టా ప్రశ్న
భారత్ నుంచి గత మూడేళ్లలో రూ.21,286 కోట్ల విలువైన 4,45,321 మెట్రిక్ టన్నుల ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా (ఎఫ్సీవీ) పొగాకు ఎగుమతులు జరిగినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కుమార్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు మంగళవారం ఆయన సమాధానమిచ్చారు.
ఎఫ్సీవీ పొగాకు ఎగుమతులు పరిమాణంలో 8.19 శాతం, విలువలో 31.20 శాతం పెరిగాయని మంత్రి వెల్లడించారు. ఏపీలో 2025-26 పంటకు పొగాకు బోర్డు ఆధ్వర్యంలో పారదర్శక ఎలక్ట్రానిక్ వేలం ద్వారా ధరలు నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ డిమాండ్, సరఫరా పరిస్థితుల ఆధారంగానే ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయన్నారు.
2023-24లో 181.02 మిలియన్ కిలోలుగా ఉన్న ఎఫ్సీవీ ఉత్పత్తి
2025-26లో 240.64 మిలియన్ కిలోలకు పెరిగిందని, సగటు ధర కిలోకు రూ.225 నుంచి రూ.288.65కు చేరిందని వివరించారు. 127కుపైగా దేశాలకు ఎగుమతులు చేస్తూ పొగాకు ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు.

