🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :
జగన్ ఫొటోలతో పాస్పుస్తకాలు పంచింది మీరే..
ప్రజలు తిరస్కరించినా బుద్ధి రాలేదా?
➖తంగిరాల సౌమ్య
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ చేసిన విమర్శలను ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు అరుణ్కు లేదని అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం భూ సర్వే పేరుతో రైతులకు ఇచ్చిన పాస్పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోలు ముద్రించి, ప్రభుత్వ పత్రాలను రాజకీయ ప్రచారానికి ఉపయోగించిందని విమర్శించారు. ప్రజలు 2024 ఎన్నికల్లో తిరస్కరించినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం రాజకీయ పార్టీలకు, వ్యక్తిగత ప్రచారానికి తావులేకుండా ప్రభుత్వ రాజముద్రతో పాస్పుస్తకాలు అందిస్తోందన్నారు. రైతుల భూ హక్కులకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకున్న వారు నేడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని సౌమ్య మండిపడ్డారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

