🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏలూరులో కోర్టు మానిటరింగ్ సెల్ విజయాలపై ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనం
బాధితులకు న్యాయం అందించి, నేరస్తులకు చట్టబద్ధమైన శిక్షలు పడేలా చేయడమే పోలీసు శాఖ లక్ష్యమని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ స్పష్టం చేశారు. ఏలూరులో నిర్వహించిన బాధితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
62 కేసుల్లో 74 మంది నిందితులకు శిక్షలు :
జిల్లాలో ఏర్పాటు చేసిన కోర్టు మానిటరింగ్ సెల్ (సీఎంసీ) సమర్థవంతమైన పర్యవేక్షణతో ఇప్పటివరకు 62 కేసుల్లో 74 మంది నిందితులకు శిక్షలు పడేలా కీలక పాత్ర పోషించిందని ఎస్పీ తెలిపారు. ఇందులో జీవిత ఖైదులు, డబుల్ లైఫ్ శిక్షలు సహా పలు కఠిన శిక్షలు ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రానికి ఆదర్శంగా సీఎంసీ :
కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్ మాట్లాడుతూ :
ఏలూరు జిల్లా కోర్టు మానిటరింగ్ సెల్ సాధించిన ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ గుర్తించి ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు.
పోలీస్–ప్రాసిక్యూషన్ సమన్వయమే విజయ రహస్యం :
నేరస్తులకు శిక్షలు పడేలా పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ విభాగం సమిష్టిగా పనిచేస్తున్న తీరును అధికారులు వివరించారు. బాధితుల అభిప్రాయాలను తెలుసుకుని, వారికి మరింత న్యాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సీఎంసీ సభ్యులకు అభినందనలు :
ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ న్యాయవాదులు, ప్రత్యేక పీపీలు, అదనపు పీపీలు, కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులు మరియు దర్యాప్తు అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు :
నేరస్తులు ఎంత తెలివిగా తప్పించుకోవాలని ప్రయత్నించినా చట్టం నుంచి తప్పించుకోలేరని, బాధితులకు న్యాయం అందించడమే పోలీసు శాఖ ధ్యేయమని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ స్పష్టం చేశారు.

