గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలకు పెద్దపీట.
ఏలూరు పార్లమెంటు పరిధిలో 54 స్మశాన వాటికలకు నిధులు.
ప్రభుత్వ కాలేజిలలో AI విద్యా బోధన.
కొయ్యలగూడెం ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, స్మశాన వాటికల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట, బయ్యనగూడెం గ్రామాలలో నిర్మించబోయే స్మశాన వాటికలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శనివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఒక్కొక్కటి 20 లక్షల రూపాయలు NREGS నిధులతో చేపట్టబోయే స్మశాన వాటిక పనులకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ ఛైర్మన్ శ్రీనివాసరావులతో కలిసి ఎంపీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ, ఏలూరు పార్లమెంటు పరిధిలో 54 స్మశాన వాటికలకు అనుమతులు ఇవ్వడంతోపాటు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన కొయ్యలగూడెం మండలాన్ని తాను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని చెప్పారు. వెనుకబడ్డ పోలవరం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు తీసుకురావటం జరుగుతోందన్నారు. కొంతమంది అభివృద్ధి నిరోధకులు చేసే దుష్ప్రచారాలు నమ్మి అపోహలకు గురికావద్దని ఎంపీ కోరారు.
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించటంతోపాటు, ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడే నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది మే – జూన్ కల్లా పూర్తి చేసి చూపిస్తామన్నారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు వెళుతున్నామన్నారు.
ఎన్నికల ముందు రోడ్లపైకి వచ్చి ముద్దులు పెట్టి తప్పుడు ప్రచారాలకు పాల్పడే మాజీ సీఎం జగన్ మాటలను విని మోసపోవద్దని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా బలపరచి 20 -30 ఏళ్ళు అధికారం అప్పగిస్తే గుజరాత్ వలె ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలుస్తుందనటంలో సందేహం లేదన్నారు.

