- ”మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
-
- నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామంలో తొలి పర్యటన.
-
- గ్రామాల్లో సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఎంపీ.
-
- శ్మశాన వాటికలకు నిధుల మంజూరు.
- పామాయిల్ రైతులకు మంచి రోజులు రానున్నాయన్న ఎంపీ.
ఏలూరు జిల్లా : ముసునూరు : ది డెస్క్ :
గ్రామాల్లోని సమస్యలను స్వయంగా తెలుసుకోవడం కోసమే “మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండల కేంద్రంలో తొలిసారిగా “మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ మాట్లాడుతూ..
నిధుల సమస్య ఉన్నప్పటికీ దశలవారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం గ్రామాలలో సౌకర్యాల పట్ల నిర్లక్ష్యం వహించిందన్నారు. తాను ఎంపీ అయిన తర్వాత గత కొద్ది నెలలుగా అనేక గ్రామాలలో శ్మశాన వాటికల నిర్మాణానికి నిధులు మంజూరు చేసామని చెప్పారు. ఒక్క ముసునూరు మండలంలోనే 60 లక్షల నిధులను శ్మశాన వాటికలకు కేటాయించడం జరిగిందన్నారు.
తాజాగా ముసునూరు ఎస్సీ కాలనీవాసుల శ్మశాన వాటిక కోసం తక్షణం 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ సభా ముఖంగా ప్రకటించారు. పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడంవల్ల పొగాకు రైతులకు నష్టం జారుతుందని కొంతమంది రైతులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎంపీ రైతుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానని హామీ ఇచ్చిన ఎంపీ, నకిలీ సిగరెట్ల అమ్మకాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులు పొగాకుతో పాటు పామాయిల్ పంటపై దృష్టి పెట్టాలని కోరారు. విమాన ఇంధనంగా పామాయిల్ వాడేందుకు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు విజయవంతం అయ్యాయన్నారు. భవిష్యత్తులో విమాన ఇంధనంగా పామాయిల్ వినియోగంలోకి వస్తే ఆయిల్ పామ్ రైతులకు మంచి రోజులు వస్తాయని, ఇప్పుడున్న ధరకు రెట్టింపు ధర ఆయిల్ పామ్ గెలలకు వస్తుందని ఎంపీ చెప్పారు.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మొదటిసారి నిర్వహించిన “మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ గ్రామాలలోని సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.
సూరేపల్లి, చెక్కపల్లి, ముసునూరు సహా పలు గ్రామాల నుంచి రోడ్లు, డ్రైనేజీ, స్మశానవాటికల కోసం వినతులు ఇచ్చారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే మండల రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ నేతలు ఎంపీకి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్ధ సారధి టెలిఫోన్ కాల్ ద్వారా సభను, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎంపీతో కలిసికట్టుగా పనిచేస్తూ నియోజకవర్గంలో గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం కంటే రెట్టింపు స్థాయిలో కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పెద్దే రఘుబాబు, మండల కూటమి పార్టీల నేతలు, యూనిట్ ఇంచార్జీలు, క్లస్టర్ ఇంచార్జిలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

