The Desk…Mangalagiri : ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు.. ఐదుగురు అరెస్ట్ – 6.30 లక్షల నగదు సీజ్

The Desk…Mangalagiri : ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు.. ఐదుగురు అరెస్ట్ – 6.30 లక్షల నగదు సీజ్

  • 5 లాప్టాప్ లు, 32 చరవాణీలు, 22 బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్కులు, 11 చెక్కులు, 30 ఏటీఎం కార్డులు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం

గుంటూరు జిల్లా : మంగళగిరి క్రైమ్ : ది డెస్క్ :

మంగళగిరి రూరల్‌ పరిధిలో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. శనివారం మంగళగిరి గ్రామీణ సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నార్త్ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు…

ఆయన మాట్లాడుతూ…ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చిన్న కాకాని ప్రాంతంలోని ఎన్‌ఆర్‌ఐ హాస్పటల్‌ వెనుక ఎస్వీఎన్‌ రెసిడెన్సీ అపార్ట్మెంట్స్‌లోని ఒక ప్లాట్‌లో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతోందని గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడి నుంచి కొక్కిలిగడ్డ ఏసన్నను అదుపులోకి తీసుకోగా, బాలు, ప్రవీణ్‌, సూర్య పారిపోవడంతో వారిని శుక్రవారం నాడు ఎన్‌ఆర్‌ఐ జంక్షన్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఈ కేసులో ఇందుకూరి బాలకృష్ణ రాజు, కొక్కిలిగడ్డ ఏసన్న, మనోహర్‌, ప్రవీణ్‌, సూర్య ప్రకాశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ₹6,30,000 నగదు, ఐదు ల్యాప్‌టాప్‌లు, 32 మొబైల్‌ ఫోన్లు, 22 బ్యాంక్ పాస్‌బుక్స్, 11 చెక్‌బుక్స్, 30 ఏటీఎం కార్డులుతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు…

ప్రధాన నిందితుడు మనోహర్ ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు కావడంతో టెలిగ్రామ్ ద్వారా అందిన లింక్‌ను నమ్మి www.hublibook.com సైట్ ద్వారా అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను ప్రారంభించినట్లు విచారణలో తెలిసిందని ఆయన వెల్లడించారు. ఇందుకోసం తెలియని వ్యక్తుల ఆధార్ కార్డులపై సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను తెరిపించి మొత్తం 30 అకౌంట్లు ఓపెన్ చేసినట్లు తెలిపారు.

ఈ గుంపు క్రికెట్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్ పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి కస్టమర్లను మోసగించేదని చెప్పారు. డిపాజిట్లు, విత్‌డ్రాలు, అకౌంట్ బ్యాలెన్స్ వంటి కార్యకలాపాలను నిందితులు కలిసి నిర్వహించినట్లు వివరించారు. ఆన్లైన్ బెట్టింగ్‌లలో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ఇటువంటి మోసపూరిత వ్యవహారాలను నిర్మూలించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ స్పష్టం చేశారు.

సమావేశంలో గ్రామీణ సీఐ ఏవి బ్రహ్మం, గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్, కేసు చేయించడంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది కే అంకమ్మరావు, జి శ్రీనివాసరావు లు ఉన్నారు.