The Desk…Eluru : రహదారి భద్రతా నియమాలపై విద్యార్థులకు అవగాహన

The Desk…Eluru : రహదారి భద్రతా నియమాలపై విద్యార్థులకు అవగాహన

ఏలూరు జిల్లా : ది డెస్క్ :

విద్యార్థి దశ నుంచే రహదారి భద్రత నియమాలపై అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతియొక్క విద్యార్థిపై ఉందని ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ అన్నారు.

గురువారం ఏలూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు రహదారి భద్రతా నియమాలపై తమ వాహన తనిఖీ అధికారులు అవగాహన కల్పించినట్లు కరీమ్ తెలియచేశారు.

రహదారి నియమ నిభందనలు పాటించకపోవడం వాహన చోదకులతో పాటూ ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదమన్నారు. రహదారి నియమాలను ప్రతిఒక్కరు పాటించడం ద్వారా ప్రమాదాల సంఖ్యను తగ్గించగలమని తెలిపారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు వాహనాలను ఇస్తే తల్లిదండులపై కేసులు నమోదు చేస్తామన్నారు, అలాగే హెల్మెట్ను, సీట్ బెల్టును ధరించి మాత్రమే వాహనాలు నడపాలన్నారు.

రాష్ మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వలన ఎందరో యువకులు తమ శరీర భాగాలను మరియు ప్రాణాలను పోగొట్టుకుని వారి తల్లిదండ్రుల జీవితాల్లో చీకట్లను నింపారని తెలిపారు.

ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని, ద్విచక్ర వాహనం కేవలం ఇరువురు మాత్రమే ప్రయాణించడానికి రూపొందించబడింది, కానీ కొందరు ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ అదుపు తప్పి ప్రాణాలను కోల్పోతున్నారని డీటీసీ తెలిపారు.

పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి విద్యార్థి డ్రైవింగ్ లైసెన్స్ ను తప్పక పొందాలని, రహదారి నియమాలను పాటిస్తూ రహదారి ప్రమాదరహిత దేశాన్ని నిర్మించడం భావితరంపై ఆధారపడి ఉందని కరీమ్ అన్నారు.

విద్యార్థులు కూడా రహదారులపై నిర్లక్ష్యముగా వాహనాలను నడపడం శోచనీయమన్నారు. ప్రతి పౌరుడు తమ హక్కులతో పాటుగా తమ విధులను, రహదారి నియమాలను పాటించిన నాడే ఆరోగ్యకరమైన సమాజాన్ని చూడగలమని డీటీసీ కరీమ్ అన్నారు.