The Desk…Vijayawada : యూపీ ముఠా భారీ చోరీ..!!

The Desk…Vijayawada : యూపీ ముఠా భారీ చోరీ..!!

  • రూ.2.5 కోట్ల విలువైన ఐఫోన్లు – సొత్తు స్వాధీనం

🔴 విజయవాడ : ది డెస్క్ :

వాళ్లంతా చిన్న చిన్న పనులు చేసుకునే రోజువారీ కూలీలే. కానీ, దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలక్ట్రానిక్‌ వేర్‌హౌస్‌లు ఉన్నాయో వివరాలు సేకరిస్తారు. ముందుగా రెక్కీ నిర్వహించి.. ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు పక్కా ప్లాన్‌తో దోపిడీ చేస్తారు.

తాజాగా నగరంలో సంచలనం రేపిన రూ.2.5కోట్ల విలువైన ఐ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పోలీసులు ఏర్పాటు చేసిన సురక్ష పథకం నిందితులను పట్టించింది. వారి నుంచి రూ.2.5కోట్ల విలువైన ఐ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.కేసు వివరాలను విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన డీప్ చంద్ ప్రజాపతి కార్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. అతని స్నేహితులైన సునీల్ కుమార్, జయప్రకాష్‌లు విజయవాడలోని వేర్‌ హౌసింగ్‌లో ఐఫోన్లు చోరీ చేద్దామని చర్చించారు. ఈనెల 5న చోరీ చేసేందుకు విజయవాడకు చేరుకున్నారు. మొత్తం ఆరుగురు కలిసి దోపిడీ చేసేందుకు స్కెచ్ వేశారు. ముందుగా రెక్కీ నిర్వహించారు. మొదట గోడౌన్ రేకులు కట్ చేశారు. ఆ తర్వాత పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సీసీ కెమెరా వైరును కట్ చేశారు.

దర్జాగా రూ.2.5కోట్ల విలువ చేసే సరుకును దోచేశారు. వేర్‌ హౌస్‌ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పటమట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితుల కారును గుర్తించి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కారు బిహార్‌లో ఉన్నట్లు గుర్తించి.. అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. బిహార్ పోలీసుల సాయంతో నిందితులను అరెస్ట్ చేశారు.

రెండు గంటలు ఆలస్యమైతే నిందితులు సెల్ ఫోన్లను నేపాల్‌లో విక్రయించే వారని సీపీ రాజశేఖర బాబు తెలిపారు. రంజిత్ అనే వ్యక్తి నిందితులకు గోడౌన్ల వివరాలు అందిస్తారని పోలీసులు గుర్తించారు. విజయవాడ సిటీ పరిధిలో సురక్ష పథకంలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటంతో నిందితులను సులువుగా గుర్తించగలిగామని సీపీ తెలిపారు.