“స్టెల్లా” కు గ్రీన్ సిగ్నల్..‼️
కాకినాడ నుంచి వెళ్లేందుకు అనుమతి
55 రోజులుగా నిలిచిన స్టెల్లా షిప్ కు మోక్షం..!!
కాకినాడ జిల్లా : కాకినాడ : THE DESK NEWS :
కాకినాడ తీరంలో గత 55 రోజులుగా నిలిచిపోయిన ‘స్టెల్లా ఎల్’ నౌకకు ఎట్టకేలకు పచ్చజెండా ఊపారు. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు నౌక బయల్దేరేందుకు అనుమతిచ్చినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం తెలిపారు.
హల్దియా నుంచి నవంబరు 11న కాకినాడ తీరానికి స్టెల్లా నౌక వచ్చిన విషయం తెలిసిందే. నౌకలోకి 32,415 టన్నులు లోడయ్యాక.. నవంబరు 27న ఆకస్మిక తనిఖీల్లో పేదల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించిన విషయం విదితమే.
ప్రభుత్వ ఆదేశాలతో డిసెంబరు 4న మరోసారి నౌకలో తనిఖీలు చేయగా.. బియ్యంలో 36 శాతం ఫోర్టిఫైడ్ కర్నెల్స్ ఉన్నట్లు తేలింది. దీంతో నౌకలోకి రేషన్ బియ్యం ఎత్తిన సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్పై పౌరసరఫరాల అధికారులు 6ఏ కేసు నమోదుచేసి, పోర్టు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నౌకలో పట్టుబడిన 1,320 టన్నుల రేషన్ బియ్యాన్ని డిసెంబరు 30న స్వాధీనం చేసుకుని గోదాములోకి తరలించి సీజ్ చేశారు. ఎగుమతిదారుల అభ్యర్థనతో మిగిలిన బియ్యాన్ని నౌకలోకి లోడింగ్కు ప్రభుత్వం అవకాశం ఇవ్వగా.. ఈ ప్రక్రియ ఆదివారం పూర్తయ్యింది.
నౌక నిలిపినందుకు చెల్లించాల్సిన యాంకరేజి ఛార్జి, కార్గో నౌకలోకి ఎక్కించినందుకు కట్టాల్సిన ఎక్స్పోర్టు రుసుము పోర్టు అథారిటీకి స్టెల్లా నౌక ‘స్టీమర్ ఏజెంట్’ చెల్లించి నోడ్యూస్ ధ్రువీకరణ పొందారు. అనంతరం కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో స్టెల్లా నౌక పశ్చిమ ఆఫ్రికా తీరం వెళ్లడానికి మార్గం సుగమం అయ్యింది.