- ఆరోగ్య శిబిరాలను మహిళలు ఉపయోగించుకోవాలి.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం :ది డెస్క్ :
- – గత పదేళ్లలో దేశంలో ప్రసూతి మరణాలు తగ్గాయి.
- – మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.
- తల్లి-బిడ్డ పోషకాహారంపై అవగాహన రావాలి.
- – గర్భిణులు, బాలింతలు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.
సమాజంగానీ, దేశంగానీ పురోగతి సాధించాలంటే ముందు మన కుటుంబాలలో మహిళలు బాగుండాలన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. అటువంటి మహిళల కోసం మన ప్రధాని మోడీ ‘స్వస్థ్ నారి, సశక్త్ పరివార్ అభియాన్’ (ఆరోగ్యవంతమైన మహిళ, సాధికార కుటుంబం) అనే దేశవ్యాప్త కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారన్నారు.
అక్టోబర్ 2, గాంధీ జయంతి వరకు జరిగే ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులకు మెరుగైన ఆరోగ్య సేవలు, సంరక్షణపై అవగాహన కల్పిస్తారని , దేశవ్యాప్తంగా నిర్వహించే ఆరోగ్య శిబిరాలలో అనేక ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తారని, వీటిని మహిళలంతా ఉపయోగించుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.
ఇందులో భాగంగా హైపర్టెన్షన్ మరియు డయాబెటిస్ కోసం స్క్రీనింగ్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్, కౌమార బాలికలు మరియు మహిళలకు రక్తహీనత స్క్రీనింగ్ మరియు కౌన్సెలింగ్, క్షయవ్యాధి పరీక్షలు, గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ డిసీజ్ (SCD) స్క్రీనింగ్, SCD కార్డుల పంపిణీ చేస్తారని ఎంపీ వెల్లడించారు. ఈ ఆరోగ్య శిబిరాల్లో గైనకాలజిస్ట్, కంటి నిపుణుడు, ENT స్పెషలిస్ట్, చర్మవ్యాధి నిపుణుడు, మానసిక వైద్యుడు, దంత వైద్య నిపుణుడు వంటి వారు అందుబాటులో ఉంటారన్నారు.
దీనితో పాటు “రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు” కూడా నిర్వహిస్తున్నారని, దీనిలో భాగంగా తల్లి-బిడ్డ తీసుకోవాల్సిన పోషకాహారంపై అవగాహన కల్పిస్తారని మహిళలంతా దీనిలో భాగస్వాములు కావాలని ఎంపీ కోరారు. 2014 తో పోల్చితే 2021 నాటికి భారతదేశంలో ప్రసూతి మరణాల రేటు (MMR) లక్షకు 130 నుండి 93కి తగ్గింది. అలాగే, శిశు మరణాల రేటు (NMR) వెయ్యికి 26 నుండి లో 19కి తగ్గిందని, ఇది ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం సాధించిన పురోగతికి నిదర్శనం అన్నారు.
ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తన పుట్టినరోజునే ఈ ‘ఆరోగ్యవంతమైన మహిళ, సాధికార కుటుంబం’ కార్యక్రమం ప్రారంభించడం మహిళల సంక్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. సెప్టెంబర్ 17 నుంచీ అక్టోబర్ 2 వరకూ జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఒక లక్షకు పైగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని, ఏలూరు పార్లమెంట్ పరిధిలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
మహిళలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలలో రక్తహీనత, పోషకాహార లోపాలను నివారించేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమాలు మహిళలకు వరం వంటివని, వీటికి హాజరై, వైద్యులు ఇచ్చే సూచనలను పాటిస్తూ ఆరోగ్యకరమైన కుటుంబం, ఆరోగ్యకరమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పిలుపునిచ్చారు.
ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు.. :
ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ప్రపంచ వేదికపై భారత్ ను బలమైన దేశంగా నిలబెడుతున్న మోదీ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని, కోట్లాదిమందికి స్పూర్తినిస్తూ, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.