🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :
పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి (రాధాకృష్ణయ్య) స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో పీజీఆర్ఎస్ (PGRS), కలెక్టరేట్, గ్రామ/వార్డు సచివాలయాలు లేదా ఎమ్మెల్యే కార్యాలయంలో పింఛన్ల కోసం దరఖాస్తులు సమర్పించిన వారందరూ తిరిగి తమ అప్లికేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
మళ్లీ అప్లోడ్ చేయాల్సిందే :
ఇదివరకు గ్రీవెన్స్, కలెక్టరేట్ లేదా సచివాలయాల్లో పింఛన్ కోరుతూ అర్జీలు ఇచ్చిన వారు దానికి సంబంధించిన ధ్రువపత్రాలతో (డాక్యుమెంట్లతో) ఆన్లైన్లో తిరిగి అప్లికేషన్లు అప్లోడ్ చేయాలి.
సమాచారం అందిస్తున్నాం :
ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇప్పటికే ఫోన్ల ద్వారా సమాచారం అందిస్తున్నామని, ఫోన్ సౌకర్యం లేనివారికి పొరుగువారు/తెలిసిన వారు ఈ సమాచారాన్ని చేరవేయాలని విజ్ఞప్తి చేశారు.
సాంకేతిక సమస్యల పరిష్కారం :
నిన్నటివరకు కార్పొరేషన్ పరిధిలో హౌస్ టాక్స్ (ఇంటి పన్ను) రశీదులు, కరెంట్ బిల్లుల సమర్పణలో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులపై అధికారులతో మాట్లాడామని, ఆ సమస్యలను తక్షణమే సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
సచివాలయ సిబ్బందికి సూచనలు :
గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది, అధికారులు ఓర్పు, సహనంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ దరఖాస్తులను స్వీకరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను సరిగ్గా అప్లోడ్ చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి పారదర్శక పాలన :
అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పారదర్శకంగా అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామని తెలిపారు.
సందేశం & సహాయక నంబర్లు (Helpline Numbers ):
సచివాలయాల్లో ఏదైనా ఇబ్బంది ఎదురైతే ప్రజలు తమను నేరుగా గానీ, క్రింది హెల్ప్లైన్ నంబర్లలో గానీ సంప్రదించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు:
9030300627
7337375880

