🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
సైదు గంగరాజు సేవలు స్ఫూర్తిదాయకం
➖ఎమ్మెల్యే చంటి
కట్టుబాట్లకు కొల్లేరు లంక గ్రామాలు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు. లంక గ్రామాల ప్రజల అభ్యున్నతి, ఐక్యత కోసం దివంగత సైదు గంగరాజు చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.
ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సైదు గంగరాజు 103వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గంగరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కొల్లేరు లంక గ్రామాలకు చెందిన విద్యలో ప్రతిభ కనబరిచిన తొమ్మిది మంది విద్యార్థులకు ‘సైదు గంగరాజు అవార్డు–2026’ పేరుతో ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు, జ్ఞాపిక, పుస్తకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
కొల్లేరు ప్రజల ఐక్యత, హక్కులు, గ్రామాల అభివృద్ధి కోసం సైదు గంగరాజు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే చంటి హామీ ఇచ్చారు. లంక గ్రామాల ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

