- గిరిజన ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడంలో ఐటీడీఏది కీలక పాత్ర...
- జాతీయ గుర్తింపు వచ్చే విధంగా పనిచేసిన ఉద్యోగులు అందరికీ అభినందనలు...
- ఐటీడీఏ చైర్మన్ (కలెక్టర్)కు, పీఓ కు ఎంపీ లేఖ.
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని ‘ కెఆర్ పురం’ ఐటీడీఏ రాష్ట్రంలోనే ఉత్తమ ఐటీడీఏ గా “ప్రధానమంత్రి జన్ మన్ ఆది కర్మయోగి అభయాన్” అవార్డు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె రాములు నాయక్ కు, ఐటీడీఏ చైర్మన్ గా ఉన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వికి ఎంపీ లేఖ రాశారు.
ప్రభుత్వ పథకాల విజయవంతానికి కృషి చేయటం, గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు, గ్రామసభలు పెట్టి ప్రజల సమక్షంలోనే సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం వంటి పనుల్లో ఐటిడిఏ అధికారులు కనబరుస్తున్న ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషం కలిగించిందన్నారు.
మారుమూల గిరిజన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర పురోగతికి అర్థం ఉంటుందని టిడిపి వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చెప్పిన విషయాన్ని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరంలో జీవో 3 తీసుకువచ్చి గిరిజనులలో మనోధైర్యాన్ని నింపిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు.
గిరిజన ఆవాసాలు కూడా మైదాన ప్రాంతాలతో అనుసంధానమై ప్రగతికి బాటలు వేయాలని, అందులో భాగంగానే గిరిజన యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించాలనే లక్ష్యంతోనే వెనుకబడ్డ గిరిజన ప్రాంతమైన జీలుగుమిల్లి వద్ద నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు తాను కృషి చేశానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు.
గిరిజన ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడంలో ఐటీడీఏ అధికారులది కీలక పాత్ర అని, అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలపై గిరిజన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐటీడీఏ అధికారులు మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా ఎంపి కోరారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా అధికారులు తన దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కరించడానికి ఎంపీగా తన వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హమీ ఇచ్చారు. ..
ఉత్తమ ఐటీడీఏ గా “ప్రధానమంత్రి జన్ మన్ ఆది కర్మయోగి అభయాన్” అవార్డు రావడానికి కారణమైన ఐటీడీఏ చైర్మన్, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి గారికి, ప్రాజెక్టు అధికారితో పాటు డివిజన్, మండల అధికారులు, ట్రైనర్స్, గ్రామస్థాయిలో పనిచేసిన ఇతర ఉద్యోగులు అందరికీ మరోసారి అభినందనలు చెబుతున్నారన్నారు.
భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో పనిచేసి గిరిజన జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరింత కృషి పనిచేయాలని కోరుకుంటున్నానని చెబుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.