ఏలూరు జిల్లా : కైకలూరు నియోజకవర్గం : ది డెస్క్ :


సంక్రాంతి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మహిళలపై నేరాలు, పేకాట, కోడి పందాలు, గుండాట వంటి జూదాలకు ఎవరూ పాల్పడకూడదని కైకలూరు రూరల్, పట్టణ, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి పోలీసులు పలు సూచనలు చేశారు. ఈ మేరకు నియోజకవర్గం లోని 4 మండలాల పోలీసులు వారి పరిధిలో అవగాహన సదస్సులు నిర్వహించారు.


ఈ సందర్భంగా కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్, పట్టణ ఇన్స్పెక్టర్లు మాట్లాడుతూ.. సంక్రాంతి సమయంలో జూదాలు, అక్రమ కార్యకలాపాలు నిర్వహించినా లేదా పాల్గొన్నా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు సమాజ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయని వారు తెలిపారు. అదేవిధంగా కైకలూరు మండలంలోని ఆలపాడు, మండవల్లి, కలిదిండి సెంటర్లో కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట, గుండాట వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రజలకు కైకలూరు రూరల్ సీఐ రవికుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ లు సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలు పోలీసులకు సహకరించి పండుగను ఆనందంగా, శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు కోరారు.

