- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసిన మంత్రి మనోహర్
🔴 విజయవాడ : ది డెస్క్ :
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణల ద్వారా సరుకుల పంపిణీ చేపడుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
విజయవాడ లో ఈరోజు మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో కలెక్టర్లు (CS) జిల్లా సరఫరా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీకి సిద్ధం కావాలనిమంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పనిచేయాలన్నారు.గతంలో కార్డుదారుల కుటుంబాలకు కుటుంబ పెద్దలా ఉన్న రేషన్ డీలర్లు అదేవిధంగా ఇప్పుడు కూడా మనసు పెట్టి పనిచేసి కార్డుదారులకు గౌరవంగా సేవలందించాలన్నారు.
రేషన్ దుకాణాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడటం, సరైన కొలతలతో సరుకులు పంపిణీ చేయడం, ధరలు, స్టాక్ బోర్డు మరియు పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు.ప్రతి దుకాణదారుడు విధిగా వారికి కేటాయించిన ePoS మరియు బరువు స్కేల్ మిషన్ పనితీరును పరిశీలించుకోవాలన్నారు.దివ్యాంగులు,
65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో సైతం సరుకులు పంపిణీ పూర్తి చేయాలన్నారు.ప్రతి నెల ఒకటో తేదీ నుంచి అయిదో తేదీలోపే దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడి వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు చొరవచూపాలన్నారు.
వాట్సాప్ గ్రూపు ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించడం వల్ల, కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చన్నారు.ఒకవేళ ఎప్పుడైనా సాంకేతిక సమస్యలు ఎదురైనాసరే కార్డుదారులకు ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరుకుల పంపిణీ జరగాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ-పోస్, వెయింగ్ మెషీన్ల రిపేర్లకు సంబంధించి సర్వీసు క్యాంపులు ప్రతి జిల్లాకు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు.