ఏలూరు జిల్లా : పోలవరం : THE DESK :
పోలవరం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం పోలవరం సందర్శనకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు.
వేలేరుపాడులో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ఎంపీ వినతి:
పోలవరం ఏజెన్సీ ప్రాంతంలోని వేలేరుపాడులో మరో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. బుట్టాయగూడెంలో ఉన్న ఎమ్మార్ఎస్ లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటికే 100 శాతం సీట్లు భర్తీ అయినట్లు ఐటీడీఏ పిఓ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విపరీతమైన డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో గల వేలేరుపాడులో మరో EMRS ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని ఎంపీ విన్నవించారు.
ప్రత్యామ్నాయ కాలనీ ఏర్పాటు చేయండి:
తరచూ వరద ముంపునకు గురై ఇబ్బందులు పడుతున్న వేలేరుపాడు మండలం కమ్మరిగూడెంలోని 220 కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు ఎంపీ విజ్ఞప్తి చేశారు. 2024 జులైలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు, 2018 నాటి వర్షాల సందర్భంగా పోటెత్తిన వరదలతో కమ్మవారిగూడెం ముంపునకు గురైందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తరచూ వరదలు వల్ల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ గ్రామానికి సమీపంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎత్తైన స్థలంలో పట్టాలు ఇచ్చి ప్రత్యామ్నాయ కాలనీని నిర్మించి ఇవ్వాలని ఎంపీ విన్నవించారు.
పెద్దవాగు సమస్య పరిష్కరించండి:
2024లో పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పోటెత్తిన వరదలతో అశ్వారావుపేట మండలం కుందవల్లి గ్రామం వద్ద పెదవాగుపై నిర్మించిన మధ్యతరగతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ డ్యామ్ యొక్క ఎర్త్ బండ్ కోతకు గురికావడంతో డ్యాంలోని ఎర్త్ బండ్, పార్పెట్ వాల్, చూట్ డ్రెయిన్లు దెబ్బతిన్నాయని, భవిష్యత్తులో ఆకస్మిక వరదల్లో డ్యామ్కు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు రూ.175 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం స్పిల్వే సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నుంచి 1.08 లక్షల క్యూసెక్కులకు పెంచడం ద్వారా అక్కడ అదనంగా 5 వెంట్లు ఏర్పాటు చేయాలని, పెదవాగు ప్రాజెక్టును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ప్రకటించాలని ప్రతిపాదించారని, రాష్ట్రాలలోని ఆయకట్టు ప్రాంతాల ఆధారంగా ఖర్చులు భరించాలని తెలంగాణ అధికారుల సూచనల నేపథ్యంలో పెదవాగు ప్రాజెక్టును రెండు రాష్ట్రాల సమ్మిళిత ప్రాజెక్టుగా చేపట్టేందుకు తెలంగాణ రాష్ట్ర అధికారులతో చర్చించడానికి వీలుగా నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఎంపీ కోరారు.
పోలవరం బాధితులను ఆదుకోండి:
పోలవరం మండలం టేకూరు R & R సమస్యలు, గృహాల నిర్మాణం, పునరావాస గ్రామాలకు బస్సులు, ఆసుపత్రి సౌకర్యాలు, దేవరగొందిలో (ప్రగడపల్లి) ll ప్యాకేజీలో విడుదల చేయాల్సిన మిగిలిన సొమ్ము, ఇళ్ల స్థలాలు, భూమి లేని పేదలకు సంబంధించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, 2015లో 1787 కుటుంబాలకు అధికారులు ఇచ్చిన హామీల అమలు కోసం 2016లో పోలవరం ప్రాజెక్ట్ కోసం ఖాళీ చేయబడిన 7 (ఏడు) గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని, పోలవరం పంచాయతీలోని పునరావాస గ్రామంలో 190 ఇళ్లు నిర్మించారని, మంజూరైన జాబితాలో 17 మంది పేర్లను చేర్చాలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.