నెల్లూరు : ది డెస్క్ :
నెల్లూరు నగరంలో ఎంతో విశిష్టత, చారిత్రక నేపథ్యం గల శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం నెల్లూరు నగరంలోని మూలపేట రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం పునః నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ పాలకమండలి చైర్మన్తో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ :
రాష్ట్రంలో పురాతన, చారిత్రాత్మకంగా ప్రసిద్ధిచెందిన ఆలయాల పునర్నిర్మాణ పనులను జరుగుతున్నాయని చెప్పారు. నెల్లూరునగరంలో పురాతన ఆలయమైన వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు చిన్నజీయర్స్వామి వారిచే భూమి పూజ చేపట్టి, పనులను మొదలుపెట్టినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 58 ఆలయాల అభివృద్ధి పనులకు 118.45 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
నెల్లూరు సంతపేటలో మహిళలకు అత్యంత నమ్మకం గల వెంకటమ్మ పేరంటాలు ఆలయ రాజగోపురం, మహామండపం పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. కోట్లాది రూపాయలతో నెల్లూరును ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
తొలుత వేణుగోపాలస్వామి ఆలయంలో జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించి, పలు సూచనలు చేశారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆలయ నిర్మాణ మ్యాప్లను పరిశీలించారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వేమిరెడ్డి భాస్కర్రెడ్డి, గార్ల వెంకటేశ్వర్లు, నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఆలయ పాలకమండలి సభ్యులు, దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

