The Desk…Mangalagiri : పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరతను అధిగమించడానికి ఈ నియమాక ప్రక్రియ దోహదపడుతుంది : హోం మంత్రి అనిత

The Desk…Mangalagiri : పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరతను అధిగమించడానికి ఈ నియమాక ప్రక్రియ దోహదపడుతుంది : హోం మంత్రి అనిత

🔴 అమరావతి : మంగళగిరి డీజీపీ కార్యాలయం : ది డెస్క్ :

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 6100 కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ ఆర్.కె. మీనా, అడిషనల్ డీజీపీ ఎన్. మధుసూదన రెడ్డి పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

3580 సివిల్ పోలీస్ కానిస్టేబుల్స్ (స్త్రీ, పురుషులు), 2520 ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ (పురుషులు) నియామకాలకై నిర్వహించిన పరీక్షల్లో విశాఖపట్టణానికి చెందిన గండి నానాజీ 168 మార్కులతో ప్రథమ స్థానంలో, విజయనగరానికి చెందిన జి. రమ్య మాధురి 159 మార్కులతో ద్వితీయ స్థానంలో, రాజమండ్రికి చెందిన మెరుగు అచ్చుతారావు 144.5 మార్కులతో తృతీయ స్థానం సాధించారని హోం మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ... మొత్తం 5,03,486 మంది అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగా 4,59,182 మంది ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరయ్యారన్నారు. వీరిలో 95,208 మంది అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించారన్నారు. 13 కేంద్రాల్లో నిర్వహించిన శారీరక సామర్థ్య పరీక్షల్లో 95,208 గాను 38,914 మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు క్వాలిఫై అయ్యారన్నారు.

10.07.2025న విడుదలైన తుది రాత పరీక్షా ఫలితాల్లో 33,921 మంది అభ్యర్థులు అర్హత సాధించారన్నారు. పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరతను అధిగమించడానికి ఈ నియమాక ప్రక్రియ ఎంతగానో దోహదం చేస్తుందని హోం మంత్రి అన్నారు. సెలక్ట్ అయిన 6100 మంది అభ్యర్థులకు సెప్టెంబర్ మొదటివారం నుండి ట్రైనింగ్ మొదలవుతుందని హోం మంత్రి తెలిపారు,

పోలీస్ శాఖలో మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు హెూం మంత్రి శ్రీమతి అనిత వెల్లడించారు. 3580 సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు జరిగిన నియామక ప్రక్రియలో 1,063 మంది మహిళలు కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారని తెలిపారు.

ఎంపికైన అభ్యర్థుల జాబితా www.slprb.ap.gov.in వెబ్ సైట్ అందుబాటులో ఉంటుందని, వివిధ క్యాటగిరీలకు సంబంధించిన కటాఫ్ మార్కులు కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని హోం మంత్రి తెలిపారు. అభ్యర్థులు మరింత సమాచారం కోసం 94414 50639 లేదా 91002 03323 నంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు. mail-slprb@ap.gov.in కు మెయిల్ చేయవలసిందిగా కోరారు.

ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ..

పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా తుది రాత పరీక్షలో విజయం సాధించి కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో సి.సి. టీవీలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ “అప్పా” కోసం ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలంలో 95 ఎకరాల భూమి సేకరించడం జరిగిందనీ….. ల్యాండ్ సర్వే జరుగుతుందని పూర్తి కాగానే నిర్మాణం మొదలు పెడతామన్నారు.

గ్రే హౌండ్స్ కి కూడా ప్రభుత్వం భూమి కేటాయించిందని తెలిపారు. కుటుంబాల నుండి దూరమైన బాలికలను గుర్తించి, వారికి అవసరమైన సహాయం అందించి, తిరిగి వారి కుటుంబాల వద్దకు చేర్చడమే ఆపరేషన్ ట్రేస్ లక్ష్యమని డీజీపీ తెలిపారు.