The Desk…Machilipatnam : యూరియా నిలువలు ఉన్నాయ్… రైతులు ఆందోళన చెందొద్దు : జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ

The Desk…Machilipatnam : యూరియా నిలువలు ఉన్నాయ్… రైతులు ఆందోళన చెందొద్దు : జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

జిల్లాలో యూరియా నిలువలు అందుబాటులో ఉన్నాయని యూరియా నిరంతరం సరఫరా జరుగుతుందని రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులతో అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో వివిధ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు.

జిల్లా కలెక్టర్ ఎక్కడికక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడి యూరియా స్థితిగతులపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా నిరంతరం కొనసాగుతుందని ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా కలెక్టర్ వారికి వివరించారు. ఇంకా యూరియా లోడ్లు వస్తున్నాయని, సరఫరా నిరంతరం కొనసాగుతుందని హామీ ఇస్తూ జిల్లా కలెక్టర్ వారిలో నమ్మకాన్ని పెంపొందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఇదే సమయానికి 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేశామన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇప్పటికే అంతకుమించి యూరియాను రైతులకు పంపిణీ చేశామన్నారు.

ఈ సందర్భంగా గన్నవరం మండలం పురుషోత్తపట్నం లో రైతులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, నక్క శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ తమ ప్రాంతంలో కొంతమంది ఇప్పటివరకు ఒక కోటా యూరియా కూడా రాలేదని, మరి కొంతమందికి రెండో కోటా రావాల్సి ఉందని కలెక్టర్కు వివరించారు. ఎకరాకు 3 కట్టల యూరియా అవసరముందని రైతులు కలెక్టర్కు తెలిపారు.

కొంతమంది రైతులు కాని వారికి కూడా యూరియా పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారనీ, ఒక ఎకరా ఉన్న రైతుకు 50 ఎకరాలు ఉన్న రైతుకు ఒకే విధంగా ఒక యూరియా బస్తాను ఇస్తే ఎలా సరిపోతుందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సోమ మంగళవారాల్లో యూరియా లోడ్ లు సరఫరా అవుతుందని, అందులో నుంచి వారికి కేటాయించడం జరుగుతుందన్నారు. రైతులందరికీ యూరియా తప్పకుండా సరఫరా చేస్తామని, ఎవరు కూడా ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ప్రస్తుతం జిల్లాలో యూరియా నిల్వ అందుబాటులో ఉన్నాయని ఇంకా అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు యూరియాను జిల్లాకు తెప్పిస్తున్నామన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా ఎకరాకు రెండు బస్తాల యూరియా సరిపోతుందనీ, అంతకుమించి వినియోగిస్తే పంట నష్టపోవడమే కాకుండా భూసారం కూడా దెబ్బతింటుందని కలెక్టర్ రైతులకు వివరించారు.

పురుషోత్తపట్నంలో కొండపావులూరు గ్రామం వెళ్లే మార్గంలో ఊర చెరువు నుండి నీరు పొంగి లో లెవెల్ కాజ్వేపై నీరుపారుతూ రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ద్విచక్ర వాహనాలు జారి పడిపోయి వాహనదారులకు దెబ్బలు తగులుతున్నాయని, ఈ ప్రమాదాలను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, పురుషోత్తపట్నంలో ముస్తాబాద్ వెళ్లే రహదారులు భవనాల రహదారి పక్కన ఉన్న కాలువ మట్టి కోతకు గురై మట్టి తొలగిపోతుందని.. రానున్న రోజుల్లో రహదారి దెబ్బ తినే అవకాశం ఉందని గ్రామానికి చెందిన నాయకులు మోహన్ రావు జిల్లా కలెక్టర్కు వివరించారు.

ఈ ప్రమాదాలను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.గ్రామాల్లో సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి యూరియా సరఫరా, వాడకంపై రైతులకు వివరిస్తున్నారా లేదా సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ఉంగుటూరు మండలం పెద్దఔటుపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎకరాకు ఎన్ని యూరియా కట్టలు వాడుతున్నారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు మధు సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ తమకు ఎగరాకు మూడున్నర కట్టల యూరియా అవసరం ఉందని ఇప్పటివరకు ఒక కట్ట సరఫరా చేశారన్నారు.

ఇంకా యూరియా సరఫరా చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఆదివారం రాత్రి సోమవారం మరో రెండు లోడ్లు యూరియా రానుందని ఎవరు కూడా ఆందోళన చెందవద్దని ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు.తదుపరి పెదవుటుపల్లె గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మెగా అవుట్రిచ్ కార్యక్రమం సజావుగా జరిగిందా లేదా అని జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.

ఇందులో భాగంగా రైతులకు యూరియా సరఫరాపై సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి వివరించి ఆందోళన చెందవద్దని చెప్పారా లేదా అని జిల్లా కలెక్టర్ కూడా ఇంటింటికి తిరిగి రైతులు మరీదు శివయ్య భార్య నాగమణి, పడమట శ్రీదేవి, సింహాద్రి సుబ్బారావు లతో ముఖాముఖి మాట్లాడారు.సిబ్బంది వచ్చి చెప్పారని రైతులు జిల్లా కలెక్టర్ తో చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

అంతేకాకుండా ఎకారాకు ఎన్ని బస్తాల యూరియా అవసరం ఉందని, ఇప్పటివరకు ఎన్ని బస్తాల యూరియా వేశారని కలెక్టర్ రైతులను అడుగగా వారు మాట్లాడుతూ తాము ఎకరాకు కనీసం 3 బస్తాల యూరియా వేస్తామని ఇప్పటివరకు ఒక బస్తా మాత్రమే సరఫరా చేశారని జిల్లా కలెక్టర్ కు వివరించారు.ఇంకా 2 యూరియా బస్తాలు సరఫరా చేయాలని వారు కోరారు.

దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని సోమ, మంగళవారాల్లో మరో రెండు లోడ్లు వస్తున్నాయని ఎవరు కూడా ఆందోళన చెందవద్దనీ, ధైర్యంగా ఉండాలని, ఓపిగ్గా సమాధానం చెప్పారు. దీంతో రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.తదనంతరం జిల్లా కలెక్టర్ బాపులపాడు మండలం వీరవల్లి, కానుమోలు గ్రామాల్లో కూడా ఇంటింటికి తిరిగి ఔట్రీచ్ కార్యక్రమాన్నీ సచివాలయ సిబ్బంది సరిగా నిర్వహించారా లేదా రైతులతో విచారించారు.

పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీ కిషోర్, గన్నవరం వ్యవసాయ శాఖ ఏడి సునీల్ కుమార్, గన్నవరం, తహసీల్దారు శివయ్య, ఉంగుటూరు ఎంపీడీవో ప్రసాద్, బాబులపాడు తహసిల్దారు మురళీకృష్ణ, మండల వ్యవసాయ అధికారి శివప్రసాద్, పురుషోత్తం పట్నం సర్పంచ్ మాదాల రోహిణి, పెదవుటుపల్లి సొసైటీ కార్యదర్శి లోకేశ్వరి వి ఏ నాగేంద్రబాబు, తదితర అధికారులు, అనధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.