The Desk … Machilipatnam : మే 1 నుండి ఇండ్ల గణన తప్పులు దొరలకుండా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk … Machilipatnam : మే 1 నుండి ఇండ్ల గణన తప్పులు దొరలకుండా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

వచ్చే మే నెల ఒకటో తేదీ నుండి చేపట్టనున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని ఎలాంటి తప్పులు దొరలకుండా సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గణన చార్జ్ అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా కలెక్టర్ కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మొదటి దశ ఇండ్ల జాబితా, ఇండ్ల గణన జిల్లా చార్జ్ స్థాయి అధికారుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల మాదిరిగా ఈ ఇండ్ల గణన కార్యక్రమాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించి శ్రద్ధతో చేయాలన్నారు. ఈ గణన కార్యక్రమంలో సరైన వివరాలు నమోదు చేయడం అందరి బాధ్యత అన్నారు.

కొందరు ఇంటి యజమానులు కింది అంతస్తు నిర్మించుకున్న తర్వాత మొదటి అంతస్తు కొత్తగా నిర్మించుకుంటారని వాటికి నంబరు తీసుకోకుండా ఉంటారని చెప్పారు.
అలాగే కొన్నిసార్లు అసైన్మెంట్, ప్రభుత్వ భూములకు ఇంటి స్థలాలుగా ఇచ్చి ఉన్న వాటికి నంబరు ఇవ్వవచ్చా లేదా అనే చాలామంది మీమాంసలో కూడా పడతారన్నారు.
వాస్తవంగా మున్సిపల్ చట్టం ప్రకారం సూపర్ స్ట్రక్చర్ పన్ను దేనికైనా వేయవచ్చన్నారు.

ప్రతి ఇంటి పన్ను చెల్లింపుదారునికి నంబర్ తప్పనిసరిగా ఎన్యుమరేటరు ఇవ్వడం చాలా ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఇండ్ల జాబితా గణన ఎలా చేయాలో పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. అప్పుడే వారు ఎన్యూమరేటర్లకు సరైన శిక్షణ ఇవ్వగలుగుతారన్నారు.

ఎన్యూమరేటర్లను నియామకంపై త్వరలో స్పష్టత వస్తుందని ఆ తదుపరి వారిని నియమించుకుని వారికి కూడా శిక్షణా తరగతులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఎన్యూమరేటరు వారికి ఇచ్చిన ఇండ్ల జాబితా బ్లాక్ లో ఏ ఏ ఇండ్లు ఉన్నాయో సరి చూసుకోవాలన్నారు.

వారికి ఒక ఎక్సెల్ షీట్ అందజేసి వారి పరిధిలో ఉన్న 700 నుంచి 800 ఇండ్లకు సంబంధించి నంబర్లు జాబితా ఇస్తే త్వరగా పని పూర్తవుతుందన్నారు.
అందరితో కలిపి ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేస్తామని ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే అందులో తెలియజేస్తే వివరణలతో నివృత్తి చేస్తామన్నారు.

ఈ శిక్షణ తరగతుల్లో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ చంద్రశేఖర రావు, మచిలీపట్నం గుడివాడ ఆర్డీవోలు సాంబశివరావు, బాలసుబ్రమణ్యం, కే ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, జడ్పి సిఈఓ కన్నమనాయుడు, డిపిఓ అరుణ, పలువురు తహసిల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.