ఏలూరు జిల్లా : కైకలూరు క్రైమ్ : ది డెస్క్ :
కైకలూరు టౌన్ పరిధిలో జరిగిన నగదు చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కైకలూరు–కోరుకొల్లు రహదారిలో బృందావనం అపార్ట్మెంట్ సమీపంలోని ఓ అరటి పండ్ల దుకాణంలో 18-01-2026 రాత్రివేళ రూ.2.80 లక్షల నగదు చోరీకి సంబంధించి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా.. సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్, ఫింగర్ ప్రింట్ల ఆధారంగా నిందితుడిని స్థానిక ఇస్లాంపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించి.. సదరు నిందితుడిని 23-01-2026న అరెస్టు చేసి, అతని వద్ద నుండి దొంగిలించిన నగదును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు జూదాలకు అలవాటు పడి, అందులో నగదు నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చోరీకి పాల్పడ్డట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి టౌన్ సీఐ ఏవీఎస్ రామకృష్ణ కేసు వివరాలను వెల్లడించారు. అనంతరం నిందితుడిని రిమాండ్ నిమిత్తం జెఎఫ్సిఎం కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.

ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో ప్రతిభను కనబరిచిన హోంగార్డు పి. రాంబాబు కు సీఐ ఏవీఎస్ రామకృష్ణ చేతులమీదుగా నగదు పురస్కారాన్ని అందించారు.

