ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు కైకలూరు పట్టణ పోలీసులు వినూత్న రీతిలో క్షేత్ర స్థాయిలో “ఫుట్ పెట్రోలింగ్” నిర్వహించారు.
కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో, ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ సిబ్బందితో పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలలో ‘ఫుట్ పెట్రోలింగ్’ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు నేరుగా ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, ఇది కేవలం జరిమానాల కోసం కాదని, ప్రాణ రక్షణ కోసమని పోలీసులు అవగాహన కల్పించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ మరియు అతివేగం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. అదేవిధంగా ఆధునిక కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాల గురించి ప్రజలను హెచ్చరించారు. తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ (OTP) వివరాలను ఎవరికీ చెప్పవద్దని సూచించారు.

డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, నిబంధనలు పాటించడం ద్వారా సురక్షితమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ తెలిపారు.

