ఏలూరు జిల్లా, కైకలూరు : THE DESK :
కైకలూరు శివారులో ఉన్న వైయస్సార్ నగర్ సమీపంలో గల 100 ఎకరాల సొసైటీ చెరువు రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. స్థానిక కూటమి నాయకులు దీనికి మద్దతు పలికారు.
ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గ డిఎన్ఆర్ బాధితుల సంఘం అధ్యక్షుడు, జనసేన నాయకుడు కొల్లి వరప్రసాద్ (బాబి) మాజీ శాసనసభ్యుడు డిఎన్ఆర్ పై పలు ఆరోపణలు చేశారు.
కొల్లి బాబి మాట్లాడుతూ.. సుమారు 1963వ సంవత్సరం లో 63 మంది చిన్న సన్నకారు రైతులు సొసైటీగా ఏర్పడి పంట పండని భూమిని చెరువుగా తవ్వుకుని లీజుకు ఇచ్చి జీవనోపాధి పొందుతున్నారన్నారు.
2022వ సంవత్సరంలో సాగు చేసుకుంటున్న లీజుదారుని గడువు పూర్తవుగా… మరొక రైతును డిఎన్ఆర్ కుటుంబం భయబ్రాంతులకు గురిచేసి లీజుకు తీసుకొనివ్వకుండా అడ్డుపడ్డారన్నారు. దీంతో సొసైటీ రైతులు జీవనోపాధి పోయేసరికి చేసేదేమీ లేక ఎకరాకు రూ.85వేలు పలికే చెరువు లీజును రూ.60వెలకు వారికే అప్పచెప్పారన్నారు.
ఆ లీజును కూడా సక్రమంగా చెల్లించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నట్లు ఆయన తెలిపారు. కొల్లేరు అభయారణ్యం (ఆటపాక పక్షుల కేంద్రం) కు కూత వేటు దూరంలో ఉన్న చెరువు పై నాటు తుపాకీతో పక్షులను వేటాడుతున్నారని బాబి ఆరోపించారు.
దీనిపై పోలీసు, అటవీశాఖ అధికారులు సమగ్ర విచారణజరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న కైకలూరు పట్టణ పోలీసులు ఆందోళన చేపట్టిన రైతులు, కూటమి నాయకులతో చర్చించి ఆందోళన విరమింపచేశారు.