కృష్ణా జిల్లా : ఘంటసాల : THE DESK :
– రూ.1.50 లక్షల ఆస్తినష్టం
– కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
ఘంటసాల మండలం, ఘంటసాలపాలెం వేమూరి గోపాలరావు నగర్ (గోటకం మాలపల్లి)లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో బాధితులు సర్వం కోల్పోయారు.
స్థానికులు అందించిన వివరాల మేరకు ఘంటసాలపాలెం వేమూరి గోపాలరావు నగర్ కి చెందిన ఉప్పులేటి సుదర్శన్ – లావణ్య దంపతులు రాతి గోడల ఇంటిలో నివసిస్తున్నారు. వారు ఇంటిలో లేని సమయంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది.
ఇంటిలో నుంచి భారీగా పొగలు, మంటలు కనిపించడంతో స్థానికులు సుదర్శన్ దంపతులకు సమాచారం అందించడంతో పాటు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తూ మొవ్వ ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు.
అగ్ని ప్రమాదంలో ఇంటిలోని వస్తువులన్నిటితో పాటు బీరువా, డబుల్ కాట్ మంచం, పిల్లల పుస్తకాలు, ఇతర సామాగ్రి మొత్తం కాలిపోయాయి.
ఈ ప్రమాద దాటికి ఇంటి స్లాబు కూడా బీటలు వారాయి. కూలీ నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్న సుదర్శన దంపతుల ఇంటిలో అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదంతో కుటుంబం రోడ్డున పడిందని, సర్వం కోల్పోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని బాధితులు వాపోయారు.
ఈ ప్రమాదంలో రూ.1.50 లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు.మొవ్వ అగ్ని మాపక సిబ్బంది ప్రమాద స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు.