ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ప్రతిపాదిత నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ఏర్పాటుపై పునరాలోచన చేస్తున్నామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
2 వేల కోట్లు అంచనా వ్యయంతో చేపట్టే నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే భావనతో ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు తాను కృషి చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు.
అయితే స్థానిక ప్రజల మనోభావాలు, పలు సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ ఈ ప్రాజెక్టు ఏర్పాటు ప్రక్రియపై పునరాలోచన చేస్తున్నామని ఎంపీ స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందటానికి అవకాశం ఉన్నందున ఇప్పటి వరకు ముందుకు వెళ్లామని, ఏది ఏమైనా ఈ ప్రాజెక్టు విషయంలో స్థానికుల అభిప్రాయాలను గౌరవిస్తామని ఎంపీ తెలిపారు.