The Desk… Eluru  : ‎30 రాష్ట్రాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్స్ – ఎంపీ పుట్టా మహేష్

The Desk… Eluru : ‎30 రాష్ట్రాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్స్ – ఎంపీ పుట్టా మహేష్

🔴‎ ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

దేశవ్యాప్తంగా మొత్తం 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫోరెన్సిక్సైన్స్ లేబరెటరీలు ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం లోక్ సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న FSL లలో డీఎన్ఏ విశ్లేషణ మరియు సైబర్ ఫోరెన్సిక్  సామర్థ్యాలను బలోపేతం చేయడానికి నిర్భయ నిధుల పథకం కింద 244.89 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో ఢిల్లీ, చండీగఢ్, కోల్ కతా, అస్సాం, భోపాల్, పూణేలలో ఉన్న ఆరు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీల్లో సౌకర్యాల కోసం మహిళా భద్రత పథకం కింద 126.84 కోట్ల నిధులు కేటాయించగా, వీటిలో ఇప్పటివరకు 22.51 కోట్లు వినియోగించబడ్డాయని మంత్రి తెలిపారు. సైబర్ ఫోరెన్సిక్ రంగంలో శిక్షణ కార్యక్రమాలు కోసం నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం గత ఐదు సంవత్సరాలలో 66 శిక్షణా కార్యక్రమాలను నిర్వహించిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ CFSL లో 37.34 కోట్లతో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లేబరెటరీ (NCFL) నెలకొల్పినట్లు  చెప్పిన కేంద్ర మంత్రి, తాజా సమాచారం ప్రకారం ఇక్కడి ల్యాబ్ లో 181 కేసులు ఫోరెన్సిక్ పరీక్షల కోసం పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు.  భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం శాంతిభద్రతల పరిరక్షణ, పౌరుల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ, దర్యాప్తు, నేరాలు మరియు నేరస్తులపై విచారణ, ఫోరెన్సిక్ సైన్స్ సౌకర్యాలు అన్నీ రాష్ట్రాల ఆధీనంలోనే ఉన్నాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఇచ్చిన సమాధానంలో కేంద్రమంత్రి వెల్లడించారు.