The Desk…Eluru : పామాయిల్ రైతుల ప్రయోజనాలపై హామీ ఇస్తూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కేంద్ర మంత్రి లేఖ

The Desk…Eluru : పామాయిల్ రైతుల ప్రయోజనాలపై హామీ ఇస్తూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కేంద్ర మంత్రి లేఖ

🔴 ఏలూరు/ఢిల్లీ, : ది డెస్క్ :‎‎

ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రయోజనాలు కాపాడుతాం..  ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కేంద్ర వ్యవసాయ మంత్రి లేఖ. ఫలించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తులు.

క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతులపై కస్టమ్ డ్యూటీ తగ్గించవద్దని కోరుతూ కేంద్ర వ్యవసాయ మంత్రికి ఏలూరు ఎంపీ లేఖ స్పందిస్తూ ఎంపీకి స్వయంగా లేఖ రాసిన కేంద్ర వ్యవసాయ మంత్రి.

పామాయిల్ ధరల విషయంలో ఏపీ రైతులు నష్టపోకుండా చూస్తామన్న కేంద్ర మంత్రి.‎‎

క్రూడ్ పామ్ ఆయిల్ ధరల విషయంలో ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  హామీ ఇచ్చారు.

క్రూడ్ పామ్ ఆయిల్ (CPO) దిగుమతులపై కస్టమ్ డ్యూటీ తగ్గించకుండా కొనసాగించాలని, ఆయిల్ పామ్ సాగు మరియు రైతులకు సరైన ధరలు లభించేలా చూడాలని కోరుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ ఏలూరు ఎంపీకి కేంద్ర మంత్రి లేఖ రాశారు.

ఈసందర్భంగా లేఖలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 2.58 లక్షల హెక్టార్లలో పామ్ ఆయిల్ సాగు జరుగుతోందనీ, ఇది దేశీయంగా వంట నూనెల ఉత్పత్తిని పెంచి,  స్వావలంబన సాధించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి అభినందించారు.‎

రైతులకు సహకారం & భవిష్యత్ దృష్టి.. కేంద్ర ప్రభుత్వం NMEO-OP (National Mission on Edible Oils – Oil Palm) ద్వారా ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యత ఇస్తోందని, ఈ ప్రోగ్రాం కింద విత్తనాలు, నాణ్యమైన మొక్కలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాసెసింగ్ యూనిట్లు మొదలైన వాటిని అందించి ప్రోత్సహిస్తోందన్నారు.

ఈ మిషన్ కింద ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 73,794 హెక్టార్లు మాత్రమే కవరయ్యాయని, కానీ కేంద్ర ప్రభుత్వ లక్ష్యం 1.12 లక్షల హెక్టార్లని, కాబట్టి ఇంకా విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని  కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  పేర్కొన్నారు.‎

‎కస్టమ్ డ్యూటీ & ఎగుమతి/దిగుమతి.. క్రూడ్ పామ్ ఆయిల్ వంటి వస్తువులపై కస్టమ్ డ్యూటీలు సమయానుసారంగా, మంత్రిత్వశాఖల సమీక్షల ఆధారంగా నిర్ణయిస్తామని, ఆ సమయంలో ‎రైతుల ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి రాసిన లేఖలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

దేశం దిగుమతులపై అధికంగా ఆధారపడకుండా, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం ఒక్కటే ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారమని, ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సహకరిస్తూ కలిసి పనిచేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.‎‎