The Desk…Eluru : అమరావతిలో మే 2న జరుగబోయే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి : మంత్రి నాదెండ్ల పిలుపు

The Desk…Eluru : అమరావతిలో మే 2న జరుగబోయే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి : మంత్రి నాదెండ్ల పిలుపు

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మానం కోసం శంకుస్థాపన చేయడానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా నాయకులతో మంగళవారం మోదీ పర్యటన నిమిత్తం సభను విజయవంతం చేయాలని దిశా నిర్దేశించారు.

అనంతరం రెవెన్యూ గెస్ట్ హౌస్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు ఆనాడు మన రాష్ట్రానికి అమరావతి ని రాజధానిగా రూపొందించాలని ఆ ప్రాంత రైతులు పెద్ద మనసుతో 34 వేల ఎకరాలను స్వచ్చందంగా అందించారన్నారు.

రాజధాని పనులకు రాష్ట్ర ప్రధాని నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేసి, రాజధాని పనులు ప్రారంభవుతుండగా, గత ప్రభుత్వం సదరు పనులను నిలిపివేసి, 3 రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చిందన్నారు. దీనిని ప్రజలెవరూ నమ్మలేదని, భూములు ఇచ్చిన రైతులు ఎంతో సహనంతో ఉద్యమాలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి పనులు మళ్ళీ చేపట్టారన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి 10 వేల కోట్ల రూపాయలు అందిస్తున్నారన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల పిలుపు మేరకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మే, 2వ తేదీన అమరావతికి విచ్చేస్తున్నారని, వారిని ఘనంగా స్వాగతించాలని, ఏలూరు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలనీ మంత్రి కోరారు. చక్కని రాజధాని ఉన్నప్పుడే రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతామన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బస్సులను ఏర్పాటుచేయడం జరిగిందని, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

5 కోట్ల గోనెసంచులను రైతుల కోసం సిద్ధంగా ఉంచాం- మంత్రి నాదెండ్ల మనోహర్

రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ చెప్పారు. గతంలో ఎకరాకు 30 నుండి 32 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చేదని, ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో 64 నుండి 70 బస్తాల దిగుబడి వస్తున్నదని, ఇది మంచి పరిణామమన్నారు.

రబీ, ఖరీఫ్ సీజన్లో 10 వేల కోట్ల రూపాయలకు పైగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటలలోగా రైతుల ఖాతాలో సొమ్ము జమచేసి ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.