ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :
అంతర్జాతీయ స్కేటింగ్ లో బంగారు పతకం విజేత జెస్సీ రాజ్ ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించారు. ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్ తన తల్లిదండ్రులతో పాటు ఆదివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

స్కేటింగ్ లో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తాను సాధించిన విజయాలను జెస్సీ రాజ్ ఎంపీ మహేష్ కుమార్ కు వివరించారు. ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించడమే తన జీవితాశయం అని జెస్సీ రాజ్ తన అభిలాషను ఎంపీ మహేష్ కుమార్ వద్ద వెళ్ళిబుచ్చారు.
14 ఏళ్ల వయసులోనే స్కేటింగ్ లో అసాధారణ ప్రతిభ చాటుతున్న జెస్సీ రాజ్ ను ఎంపీ మహేష్ కుమార్ మనస్ఫూర్తిగా అభినందించారు. న్యూజిలాండ్లో జరిగిన వరల్డ్ స్కేట్ ఓషియానియా పసిఫిక్ కప్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం కైవసం చేసుకొని, ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్న జెస్సీ రాజ్ ఏలూరు జిల్లాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని ఎంపీ మహేష్ కుమార్ కొనియాడారు.
భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి ఉన్నతికి చేరుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ దీవించారు. తన వంతు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని ఎంపీ మహేష్ కుమార్ జెస్సీ రాజ్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిసేందుకు ఏర్పాట్లు చేస్తానని ఎంపీ మహేష్ కుమార్ హామీ ఇచ్చారు.