🟡 నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ :
భారత పార్లమెంటులో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేస్తూ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:
2026 ఏప్రిల్ 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త యుగానికి నాంది పలికిందని అన్నారు.
అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేయడంతో కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాయని తెలిపారు. దేవతలు పాలించిన పుణ్యభూమి అయిన అమరావతి ఇక రాష్ట్ర శాశ్వత రాజధానిగా రూపుదిద్దుకోవడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, యువనేత నారా లోకేష్ల దూరదృష్టి, ఆలోచనల మేరకు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబడిందని మంత్రి తెలిపారు.
ఈ బిల్లును భారత పార్లమెంటులో ఆమోదించేందుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఎన్డీఏ కూటమి నాయకులకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు వ్యక్తం చేస్తూ, రాష్ట్రాన్ని విభజించేందుకు చేసిన ప్రయత్నాలకు ఇది గట్టి సమాధానమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను తిప్పికొడుతూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అహర్నిశలు కృషి చేస్తోందని మంత్రి ఆనం స్పష్టం చేశారు.

