🔴 దిల్లీ/ఏలూరు : ది డెస్క్ :
భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ డీపీఆర్ సిద్దం అయ్యిందని, త్వరలోనే పనులు మొదలవ్వబోతున్నాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు.
ఈ మేరకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ మీడియాకు ప్రకటన విడదల చేశారు. ఈ రైల్వే లైనుకోసం గత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే తేదీ: 02/04/2025 రోజున పార్లమెంట్ సాక్షిగా కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.
ఏలూరు లోక్సభ పరిధిలోని చింతలపూడి, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు, పాత ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల ప్రజలు కూడా ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ పనులను ఇప్పటికైనా మొదలు కాబోతుండటం చాలా సంతోషంగా ఉందని ఎంపీ పుట్టా మహేష్ అన్నారు. సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి మీదుగా కొవ్వూరు వరకూ 118.9 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన రైల్వే లైన్ కు దాదాపు రూ: 1,695.71 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
దీనితో విశాఖపట్నం – హైదరాబాద్ మధ్య 100కు పైగా కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉండిపోయిన ఈ ప్రాజెక్టు కోసం ఏడాదికాలంగా తన వంతు కృషి చేశానని, పార్లమెంటులో తనకు మాట ఇచ్చిన ప్రకారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చర్యలు తీసుకున్నందుకు ఏలూరు పార్లమెంటు ప్రజల తరపున ప్రధాని నరేంద్రమోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదములు తెలిపారు ఎంపీ.
రైల్వే అధికారులు పంపిన డీపీఆర్ను ఆమోదించి, పనులు త్వరగా మొదలు పెడతారని ఆశిస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన ప్రకటనలో తెలిపారు.