- రాష్ట్రంలో రామరాజ్యాన్ని నెలకొల్పుతున్నాం.
- దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసాం
- కొంతమంది సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు
- ఎవరెన్ని కుట్రలు, అసత్య ప్రచారాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏమి చేయలేరు…అభివృద్ధిని అడ్డుకోలేరు
- ప్రజల అభీష్టం మేరకే జిల్లాల పునర్ విభజన ప్రక్రియ చేపట్టాం
- నెల్లూరు జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు కలువాయి సైదాపురం రాపూరు మండలాలు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాం
- కృష్ణపట్నం పోర్టును కూడా నెల్లూరుకే కేటాయించారు
- గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపడం శుభ పరిణామం
- ప్రజల ఆమోదంతో పనిచేసే ప్రభుత్వం ఇది
- పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుతో పారిశ్రామిక ప్రగతి వైపు రాష్ట్రాన్ని పయనింప చేస్తున్నాం
- ఏడాది కాలంలోనే అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించాం
- ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని మరింత వేగంగా కొనసాగిస్తాం.
➖దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
నెల్లూరు జిల్లా : నెల్లూరు : ది డెస్క్ :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ తో సుపరిపాలన అందించి సూపర్ హిట్ కొట్టామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్న తనకు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం గర్వకారణమని అన్నారు. గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం పాత్రికేయులతో ఇష్టగోష్టిగా మాట్లాడారు.
తమ ప్రభుత్వ పాలనలో మీడియా కూడా ఎంతో కీలకంగా పనిచేస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను చేరవేస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయిందని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ:
ఏడాది చివరి రోజు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించామని, కానీ కొందరు నేతలు, అధినాయకులు సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు. కొత్త సంవత్సరంలో కూడా ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పథకం ద్వారా రూ.10,090 కోట్లు, స్త్రీశక్తి పథకం కింద మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు రూ.వెయ్యి కోట్లకు పైగా,అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు, దీపం–2 పథకం ద్వారా 2 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.2,684 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా ఫించన్లకు గత ఏడాది రూ.33 వేల కోట్లు పంపిణీ చేశామని వెల్లడించారు.
గత ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి ఇప్పటివరకు 4 కోట్ల మందికి భోజనాలు అందించామని, త్వరలో గ్రామాల్లోనూ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఎస్సీ వర్గీకరణ విషయంలో మాటలకే పరిమితమైన గత ప్రభుత్వాలకు భిన్నంగా, కూటమి ప్రభుత్వం చట్టం చేసి అమలు చేస్తుందని స్పష్టం చేశారు.మెగా డీఎస్సీ ద్వారా ఒకే రోజు 15,941 ఉద్యోగాలు, పోలీస్ శాఖలో 5,747 ఖాళీల భర్తీ చేశామని తెలిపారు. గత వైసీపీ పాలనలో మిగిలిపోయిన 84 లక్షల టన్నుల చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని,
రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మత్తులు, రూ.3,000 కోట్లతో నూతన రోడ్ల పనులు చేపట్టామని వివరించారు.
పారిశ్రామిక రంగంలో 23 కొత్త పాలసీలు తీసుకొచ్చామని, ప్రతి జిల్లాకు ఒక పోర్టు వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. వైజాగ్లో జరిగిన సమ్మిట్లో రూ.13.21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. విదేశీ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు.
ఆగమశాస్త్ర నియమాల మేరకు ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారాలను సరిచేశామని చెప్పారు. దేవాదాయ శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. వేద విద్యను ప్రోత్సహిస్తున్నామన్నారు.
492 పురాతన ఆలయాల్లో రూ.590 కోట్లతో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఆలయాలను ఎకో టెంపుల్ టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు.జిల్లాలో రేపటి నుంచి రెవెన్యూ సదస్సుల ప్రక్రియ ప్రారంభమవుతుందని, రెవెన్యూ సదస్సులను ప్రారంభించి ప్రభుత్వ రాజ్యముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందించనున్నట్లు చెప్పారు. కృష్ణపట్నం పోర్టును తిరుపతి జిల్లాకు తరలించాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం సరిచేసి, కృష్ణపట్నం పోర్టుతో పాటు వెంకటగిరి మూడు మండలాలు, గూడూరును నెల్లూరు జిల్లాలో కొనసాగించిందని చెప్పారు.
ప్రజల ఆమోదం మేరకే జిల్లాల పునర్విభజన చేపట్టామని, నెల్లూరు జిల్లాకు ఎంతో మేలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆనం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా స్టేట్స్మన్గా గుర్తింపు పొందారని, ఆయనపై కేసీఆర్ విమర్శలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు.జిల్లాకు పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.కూటమి ప్రభుత్వం రాకతో రామరాజ్యం ఆరంభమైందని,ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం ధీమా వ్యక్తం చేశారు.

